ఆంధ్రప్రదేశ్‌

ఇసుక కొరత ప్రభుత్వ సృష్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టించి పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురువారం విజయవాడ ధర్నాచౌక్‌లో చంద్రబాబు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 12 గంటల ఇసుక దీక్ష నిర్వహించారు. ఆ వయస్సులో సైతం బాబు ఎంతో ఓపిగ్గా 12 గంటల పాటు వేదికపై కూర్చోవటం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ఇసుక కొరత అనేది ప్రభుత్వం సృష్టించిన సమస్యే అన్నారు. ప్రకృతి ప్రసాదించిన ఇసుక ప్రతి ఒక్కరి వినియోగానికి అందుబాటులో ఉండాలన్నారు. ప్రతీ నిర్మాణానికి ఇసుక అవసరం ఉందని, అలాంటి ఇసుకను కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఇసుక దాహానికి పేదల బతుకులు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది చనిపోతే కేవలం ఐదుగురికే రూ. 5లక్షల పరిహారం ఇచ్చారు.. ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలన్నింటికీ న్యాయం చేయాలని బాబు డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరికైనా భరించలేని ఆవేదన వల్లే ఆత్మహత్యల ఆలోచనలు వస్తాయన్నారు. ఇక గత్యంతరం లేదు, తాను పోతే తప్ప సమస్య తీరదు అన్న ఆవేదనతోనే ఆ ఆలోచన వస్తుందన్నారు. సెల్ఫీ వీడియోలు తీసి కార్మికులు చనిపోవడం గతంలో ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. వాళ్ల ఆవేదనకు సెల్ఫీ వీడియోలే నిదర్శనాలన్నారు. ఇసుక కొరత కారణంగా 35 లక్షల మంది కార్మికులు దసరా, దీపావళి పండుగలు చేసుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డలను చదివించలేక, కుటుంబ సభ్యుల కడుపు నింపలేక మనోవేదనకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులకు కారణం ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. తాపీ కార్మికులు, తాపీ మేస్ర్తిలు, ఇటుక బట్టీల వాళ్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఈ విధంగా 125 వృత్తులకు చెందిన 35 లక్షల మంది ఇసుకపై ఆధారపడి ఉన్నారన్నారు. లారీలు, ట్రాక్టర్లు, ట్రాన్స్‌పోర్టు రంగంపై ఆధారపడ్డ వారి ఉపాధి సైతం దెబ్బతిందన్నారు. స్టీల్, ఐరన్, హార్డ్‌వేర్ దుకాణాలు మూతపడ్డాయి... సిమెంట్ అమ్మకాలు పడిపోయాయి.. అనుబంధ వృత్తులన్నీ దెబ్బతిన్నాయి.. కృత్రిమ ఇసుక కొరత రాష్ట్రంలో తీవ్ర సంక్షోభానికి కారణమయ్యిందన్నారు. గతంలో టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుక పాలసీని విమర్శించిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక మాఫీయాను తయారు చేశారని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని రాబందుల పాలు చేశారన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ. 2 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష వేస్తారట.. నిన్న కేబినెట్‌లో పెట్టారట.. ఒక పక్క దోచుకునేది మీరే.. మరో పక్క జరిమానాలు విధించేదీ మీరేనా.. వైసీపీ నాయకుల్లో ఎంత మందికి జరిమానా వేస్తారని ప్రశ్నించారు. బెంగళూరులో దొరికేది ఏపీ ఇసుకే, చెన్నైలో దొరికేది ఏపీ ఇసుకే, హైదరబాద్‌లో దొరికేది ఏపీ ఇసుకే, ఈ ఐదు నెలల్లో కనబడలేదా ఈ ఇసుక మాఫియా అని ప్రశ్నించారు. ఇసుక కొరతపై టీడీపీ గత మూడు నెలలుగా పోరాటం చేస్తోందన్నారు. జిల్లా స్థాయిలో ఆందోళనలు, దీక్షలు చేశాం, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం తదితర ప్రతిపక్షాలన్నీ ఆందోళనలు చేస్తున్నాయన్నారు. కేజీల లెక్కన ఇసుక కొనే దుస్థితి తెచ్చారన్నారు. ఇసుక దండలు వేసుకుని నిరసన తెలిపే దురవస్థ కల్పించారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతల కుటిలమైన ఆలోచనలో మార్పు రావాలి అప్పుడే కార్మికుల ఆత్మహత్యలు తగ్గుతాయని అన్నారు. మీడియా విమర్శిస్తోందని జీవో 2430 తెచ్చారు.. మీడియా గొంతు నులిమేయాలని చూస్తున్నారని అన్నారు. ఎవరెన్ని చెప్పినా తాను చేయాల్సింది చేస్తా అన్న పెడధోరణితో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. పేదలను అష్టకష్టాల పాలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అంధకారంలో ముంచుతున్నారన్నారు. ఇలాఉంటే చంద్రబాబు ఇసుక దీక్ష విజయవంతమయింది. పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
*చిత్రం... విజయవాడలో గురువారం చేపట్టిన ఇసుక దీక్షలో నిర్మాణ రంగం కూలీలతో చంద్రబాబు నాయుడు